Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page

హిందువుల ధర్మము

మొట్టమొదటి విషయం ప్రతిహిందువూ తాను హిందువుగా జీవించడము నేర్చుకోవాలి. 'హిందూ కో హిందూ బన్‌నా చాహియే' ఇదే ఈరోజు అన్నింటికన్న ముఖ్యమైన విషయం. భూలోకంలో అనేక ఖండములున్నవి. అనేక దేశము లున్నవి. ఆయా చోట్ల అనేక దేశములలో ఈనాడు హిందువులు నివిసిస్తున్నారు. ఆఫ్రికాలో మారిషన్‌ దీవులలో మలయా, సింగపూర్‌, ఇండోనీషియా, కెనడా మొదలైన ఖండాంతరాలలో, ద్వీపాంతరాలలో హిందువులు వ్యాపించి వున్నారు. విశ్వహిందూ పరిషత్తు అని అన్నపుడు దానిలో ప్రపంచములో వున్న హిందువులంతా భాగస్వాములవుతారు. వారందరికీ అందులో సభ్యత్వం ప్రాతినిధ్యం ఉన్నట్లే.

ఇంతకూ ఈ పరిషత్తు లక్ష్యమేమి? ఆదర్శాలేమి? సామాన్యముగా జాతులవారీగా ఏర్పడే ఈలాంటి సంస్థలన్నియు, తమ తమ జాతివారల అభ్యుదయానికీ, సుఖజీవనానికీ కృషి చేస్తూ ఉంటాయి. వారలలో పరస్పర ప్రేమ, సద్భావములు నెలకొనడానకి, ఆ జాతికి చెందిన వారందరూ ఒకే కుటుంబముగా జీవించడానికి అనువైన కార్యక్రమాములు తలపెట్టి నెరవేర్చుకొంటాయి. ఈనాడు విశ్వవ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువుల మధ్య కూడా ఒక సహకార భావం. సదవగాహన, సహానుభూతీ మొదలైనవి నెలకొనాలి. చీకటి-వెలుగు-రాత్రి-పగలు-కష్టము-సుఖము, ఈ ద్వంద్వములు అందరికీ సహజములు. వీనిని ప్రతి ఒక్కరూ తన తోటిసోదరునితో కలిసి పాలు పంచుకోవాలి. ఒకరి ఇంట్లో వివాహం జరిగితే అతిని జాతికి చెందిన వారంతా ఆ సంతోషాన్ని పంచుకోవాలి. అలాగే కష్టము వచ్చినా పొరుగువారు వెళ్ళి అతనిని ఆదుకొనాలి. కష్టాన్నీ, సుఖాన్నీ పంచుకోవటం అంటే ఇదే.

ఒక కుటుంబంలోని వారు కష్టసుఖాలను ఎలా సమంగా అనుభవిస్తారో, అలాగే ఒక జాతివారు, ప్రాంతాలవారు, దేశాలవారూ తామందరమూ ఒకే కుటుంబమని భావించి పరస్పర సహకారం అలవాటు చేసుకోవాలి. ఒక జాతిలోని వారిలో ఏ కొద్దిమంది మాత్తమే సంపన్నులై మేడలలో, మిద్దెలలో వుంటే చాలదు. వారు తమ జాతికి చెంది కడుపేదస్థితిలో నున్న బహుసంఖ్యాకులకు సహాయపడాలి. అందరూ, అందరికీ ఆర్థికంగా సహాయపడగల్గిన స్థితిలో లేకపోవచ్చును. ఐనా, 'వాడు మనవాడు. ప్రస్తుతం కష్టంలో ఉన్నాడు. వాని కష్టాలు తీరిపోవాలి' అనే భావమైనా పొరుగు వారిపట్ల మనకు ఉదయించాలి. అటువంటి భావమున్నాచాలు. వస్తురూపంలోనే సహకరించనక్కరలేదు.

తోటివాని క్షేమాన్ని ఆకాంక్షించే ఈ భావాన్ని ప్రేమ అని చెప్పవచ్చును. ఒకని మీద ప్రేమ వుంటే కానీ, అతని క్షేమమును మనస్ఫూర్తిగా కోరలేము. కనుక హిందువులమైన మనకు ఈ పరస్పర ప్రేమభావం అంకురించాలి. మారిసస్‌లో హిందువులున్నారని అనుకోండి. వారికి ఏదో కష్టం కలిగింది. వారికష్టం తీర్చడానికి మనవద్ద డబ్బులేక పోవచ్చు. అన్నానికే బాధ పడుతున్న మనం వారికి ఆహారసహాయం చేయలేకపోవచ్చును. అయినప్పటికీ, వారి కష్టం తొలిగిపోవాలి అని మనం భగవంతుని ప్రార్థించవచ్చును. ఆవిధంగా పరోక్షంగానైనా వారికి మనశ్శాంతిని కలిగించవచ్చు.

ఈలాంటి పరస్పర ప్రేమ ప్రపంచములో ఉన్న హిందువులందరిలోనూ కలుగచేయడమే విశ్వహిందుపరిషత్తు యొక్క లక్ష్యం. మరొక విషయం కూడా వున్నది. వెనుకటి రోజులలోనే కాక, ఈనాడు కూడా కారణాంతరాలచేత ఎంతోమంది హిందువులు మనమతం వదిలి అన్యమతాన్ని స్వీకరిస్తున్నారు. వారు ఏ కారణం చేత, ఏ ఆకరణ చేత ఇతర మతాలకు వెళ్ళుతున్నారో గమనించాలి. వాళ్ళకు ఏ కష్టాలు కలిగి, ఏ విషయాలు నచ్చక, మనమతం వదలిపెట్టి పోతున్నారో గమనించి, వీలైనంతవరకు ఆకారణాలు తొలగించి, వారిని మనమతంలో నిలుపుకోవాలి. ఇది చాల ముఖ్యం. మన మతస్థులను మతేతరములకు వెళ్ళనీయక ఆపటం. ఆ మతాలలో సంఘరణ పడటం కాదు. ఇతర మతములనూ, మతస్థులనూ ద్వేషించమనీ కాదు. మన ఇల్లు మనం చక్కబెట్టుకోవటం. పరాయి వారిని ద్వేషించికాదు, ఇందుకు ప్రధానం హిందువులయిన వారు తమ ధర్మాచరణను పట్టుదలతో చేయటమే.

ఈనాడు హిందువులలో నాస్తిక్యము, ధర్మవిరోధప్రవృత్తీ ప్రవేశించినవి. వాటిని మనం అరికట్టాలి. విదేశాలలో రెండు కోట్లమంది హిందువులున్నారు. ఎన్నో దశాబ్దాలు, శతాబ్దాల క్రింద వారు వలస వెళ్ళారు. వాళ్ళలో చాలమంది తమ ఆచార వ్యవహారాలనూ, ధర్మవిహితమైన సంస్కారాలనూ, మరిచిపోయారు. హిందువులము అన్నభావం ఒకటి మాత్రం వారిలో నిలిచివుంది. అలాంటి వాళ్లకు, వాళ్ళ వాళ్ల సంస్కారాలు, ఆచారాలు నేర్పాలి. ఇది విశ్వహిందుపరిషత్తు చేయవలసిన ముఖ్యకార్యములలో ఒకటి.

బయటి దేశాలలో వుండే హిందువుల యోగక్షేమాలతో బాటు మనదేశంలో మారుమూలలలోనూ, ప్రతి ప్రాంతంలోనూ, ప్రతినగరంలోనూ వుండే హిందుల కష్టసుఖములు తెలుసుకొని వారి శాంతి సాధనములు అన్వేషించాలి. ఈ సంస్థ అందుకు పాటుపడాలి. ఈనాడు గిరిజనులున్నారు. మురికి గూడెములలో ఉండే వారున్నారు. వారందరి క్షేమములూ తెలుసుకోవాలి. ఇటీవల అస్సాంలో, నాగాలు, మిజోలు, అనే గిరిజనులు చాలామంది మతం మార్చుకున్నారని విన్నాం. వారిమాదిరి కాకుండా మతం మార్చుకోని వాళ్ళున్నారు. వాళ్ళకు సంబంధించి జనాభా లెక్కలు వగైరా తెలుసుకొని కనీసం వారినైనా రక్షించే యత్నం చేయాలి. నేపా ప్రాంతంలో పరశురామకుండమని ఉన్నది. అక్కడ శివరాత్రికి ప్రతి సంవత్సరమూ వేలాది జనం స్నానానికీ, దేవదర్శనానికీ, సమావేశమౌతారట. ఆపుష్కరిణికి జీర్ణోద్ధరణ కార్యక్రమం చేపట్టి పూర్తిచేయాలి. అలాగే కన్యాకుమారి వద్ద ఇతర మతం నుంచి హిందువులుగా మారి, తమకు ఆలయం లేదనీ అది కావాలనీ అడిగారట. ఆలయాలు ఉన్నచోట హిందువులు అక్కడకు వెళ్ళటం మానివేశారు పాపం. ఆధీవరులు, తమ చుట్టుపట్ల నున్న అన్యమత ప్రభావానికి లోను కాకుండా ఉండి తమకు ప్రార్థనాదికాలకు దేవాలయం కావాలంటున్నారు. అది వారి కనీసపు కోరిక. దానిని తీర్చవలెను.

మనదేశంలో వుండేవాళ్ళను, క్రైస్తవ మతంలోకి త్రిప్పుకొనేందుకు ఎన్నో మిషన్లు పనిచేస్తున్నవి. వానిలో ప్రతి సంస్థ ఏడాదికి ఒకమారు తాము చేసిన ప్రయత్నాలు గురించి ఒక రిపోర్టు ఇంగ్లండులో వున్న తమ ప్రధాన కార్యాలయానికి పంపాల్సి వున్నది. వానిలో ఒక సంస్థ మిషనరీ తన రిపోర్టులో ఇలా వ్రాశాడట.

''భారతీయులను క్రైస్తవులుగా చేయడం రెండు మార్గాలలో జరగవలసి ఉన్నది. మొదట భారతీయులకు తమ మతం పట్ల అభిమానం నశించేటట్లు చేయడం, ఇందువల్ల నూటికి యాభైపాళ్ళు మనలక్ష్యం నెరవేరినట్లే. రెండవదశ, ప్రత్యక్షంగా వారిని మతాంతరులుగా చేయడం. ఈ కార్యక్షేత్రంలో మొదటి మార్గంలో యాభైపాళ్ళు విజయం సాధించాను. ఇంక మతాంతరీకరణం లాంఛనప్రాయంగా జరగవలసిన విషయం. దానితో పూర్తి విజయం సాధించినట్లే.

ఈ మిషనరీ చెప్పినది నిజమే! ఒకనికి తన మతంలో విశ్వాసమూ, భావమూ లేనపుడు వాడు మతంలో ఉన్నా లేనివాడే ఔతున్నాడు. ఇతర మతాల వారికంటే, మతంలోనే ఉంటూ విశ్వాసం లేకుండా ప్రవర్తించేవాడు మాతానికి చేసే గొప్ప హాని.

ఇక్కడ నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తోంది. 1937 లో మద్రాసులో కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధాన మంత్రి రాజాజీ. ఆరోజులలో ఈ విషయం జరిగింది. మనలో 18 ఏండ్ల లోపల ఉన్న పసిపిల్లలు నేరాలు చేస్తే వాళ్ళను పట్టుకొని స్కూళ్ళలాంటి జైళ్ళలో పెడతారు. వయస్సులో చిన్నవాళ్ళు కనుక పెద్దవాళ్ళయిన ఖయిదీల మాదిరికాక, వాళ్ళలో మానసిక పరివర్తన తెచ్చుటకు నీతివిషయాలు బోధిస్తూ వుంటారు. అది మొదటి నుంచీ వస్తున్న విషయమే కానీ అంతవరకు ఇంగ్లీషు వాళ్ళ పాలన వుండేది కనుక, ఈ నీతులను బోధించేవారు క్రైస్తవ మిషనరీలు ఆరోజులలో మనం ఏమీ అనేందుకు వీలు వుండేది కాదు. ఇక కాంగ్రెసు అధికారంలోకి రాగానే మనకు కొన్ని అధికారాలు లభించాయి.

( 9 - 6 )

రాజాజీ, ఆ బాలనేరస్థులకు నీతిబోధ చేసే విషయం గూర్చి బాగా ఆలోచించారు. సామాన్యంగా మనదేశంలో హిందువులు హెచ్చుకనుక, ఆ బాలనేరస్థులలోనూ హిందువుల సంఖ్య హెచ్చుగా ఉండేది. అందరికీ క్రైస్తవకథలూ, నీతులూ, ఉపదేశించడానికి బదులు, ఏ మతం వాళ్ళకు ఆ మతానికి చెందిన వారిచేత నీతిబోధ చేయిస్తే మంచిదని, వారానికి ఒక రోజు ఆ బాలనేరస్థులకు, నీతిబోధకై సెలవు ఇచ్చే ఏర్పాటు చేశారు. మహమ్మదీయబాలురు తమకు శుక్రవారం ముఖ్యం కనుక ఆ రోజు సెలవు ఇవ్వవలసినది కోరారు. ఆరోజు మసీదుకు వెళ్ళి నేర్చుకొంటామన్నారు. క్రైస్తవులు తమకు చర్చీకి వెళ్ళటానికి ఆదివారం సులువుగా వుంటుందని ఆరోజు సెలవు కోరారు. హిందువులను అడిగితే వారికి ఏ రోజు చెప్పడానికీ, తోచక, మాకూ ఆదివారమే ఇవ్వండి అని అడిగారు. సరే ముగ్గురినీ వదిలారు. మహమ్మదీయ మౌల్వీవచ్చి, వాళ్ళను మసీదుకు తీసుకొని వెళ్ళాడు. క్రైస్తవులేమో చర్చికి వెళ్ళారు. హిందూబాలురను తీసుకొని పోయిన పెద్దమనిషి హిందువుల ధర్మమువారితో బాటు సినిమాకు వెళ్ళాడట! ఇది చాల దయనీయమైన స్థితి.

దీని నుంచీ మనం బయటపడాలి. ఇప్పుడిప్పుడు కొన్ని చోట్ల జైళ్ళలో ప్రార్థనలూ, భజనలూ, జరగడం ప్రసాదం పంచిపెట్టడం లాంటి పనులు ప్రారంభమవుతున్నాయి. హిందువులకు తమమతం గురించి జ్ఞానం లేకపోవటం అటుంచి దానిపై ప్రేమ భావం కూడా లేనందున, ఆ ఫాదిరీ తన రిపోర్టులో ఆ విధంగా వ్రాశారు. ఈ పరిస్థితి పోవాలి. అంటే మనం మొదట హిందువులమని గుర్తించాలి. ఇతర మతాలవారిని మనమతంలోకి మార్చుకోవలసిన అవసరం లేదు. హిందువులు హిందువులుగా మారితే చాలు. అందుకు మనమేమి చేయాలి?

విశ్వహిందూపరిషత్తు యొక్క పేరు, విశ్వధర్మంగా వెలసిన హిందూమతప్రాభవానికి అనుగుణంగానే వుంది. ఐతే ఈనాడు అది చాల భాగం మాసిపోయింది. దానిని మనం బాగు చేసుకోవాలి. మనలోని లోపాలను ఆత్మపరీక్ష చేసుకొని పోగొట్టుకోవాలి. ఇది ఎట్లా సాథ్యం?

మన ధర్మశాస్త్రాలలో విశేష ధర్మాలనీ, సామాన్య ధర్మాలనీ రెండు రకములున్నవి. వర్ణాశ్రమవ్యవస్థను పాటించే వారికి విశేషధర్మాలున్నాయి. బ్రాహ్మణుడు సంధ్యావందనం చేయాలి. అధ్యయనం చేయాలి. ఇవి విశేషధర్మాలు. వర్ణాశ్రమ వివక్షతలేక, మానవమాత్రులందరూ అనుష్టించ దగినవి సామాన్య ధర్మాలు. ఇవి హిందువులకేకాక, మానవులందరికీ అనుప్ఠేయాలు. 'ఏతాన్‌ ధర్మాన్‌ సమాసేన' అంటూ సామూహికంగా వానిని జీవితంలో అనుష్ఠించవలసిన ఆవశ్యకత సూచింప బడినది. అవి మనం ముఖ్యంగా హిందువులు అనుష్ఠించాలి. భారతదేశంలోనే వీనిని మనం అనుష్ఠించకపోతే హిందూత్వం అంటూ ఇక్కడ ఉన్నదని చెప్పుకోలేము. అపుడు ఇతర దేశములలో ఉన్న హిందువులకు ఏవిధంగానైనా మనము సహాయపడలేము. విశ్వహిందూ పరిషత్తు లక్ష్యమే దెబ్బతింటుంది. కనుక, ఈ సామాన్యధర్మాలను మనం విధిగా అనుష్ఠించాలి.

ఈ సామాన్య ధర్మాలేవి? ప్రతిరోజూ ధ్యానంచేయాలి. కనీసం మూడునిముషాలైనా ఏకాగ్రతతో తమకు ఇష్టమైన దైవాన్ని గురించి ధ్యానం చేయాలి. ధ్యానం చిత్తశుద్ధికి తోడ్పడుతుంది. దానివలన మనస్సు నిర్మల మౌతుంది. మనస్సుకు చీకూచింత అంటూ వుండదు. ఒకవేళ సమస్యలు ఉన్నా అవి మనలను అంతగా కలవర పెట్టవు. ఇక రెండవ విషయం దానం. దానం చేయటం హిందువు ఐన వానికెల్లా సామాన్యధర్మం. దాన స్వరూపం అనేక విధాలుగా వుంటుంది. శరీరంతో, ధనంతో, బుద్ధివైభవంతో ఇతరులకు మనం సహాయపడవచ్చు.

అది అంతా దానమే ఔతుంది. దానం మానవుల కందరికీ సామాన్య ధర్మం. అది చేయడానకి తగిన యోగ్యత సంపాదించుకోవాలి. ఒక స్త్రీమీద ఆత్యాచారం జరుగుతుందని అనుకోండి. అపుడు చూస్తూ ఊరుకోరాదు. అత్యాచారం చేసే దుర్మార్గులను ఎదుర్కొనిపోరాడి ఆ స్త్రీని రక్షించాలి. ఇది ఒక విధమైన దానం. శరీరబలం ఇక్కడ వినియోగమౌతున్నది. మనకు బలసాహసాలున్నపుడే ఇతరులకు తోడ్పడగలం. అందుచేత చక్కగా వ్యాయాయం చేసి శరీరబలం పెంచుకోవాలి. ధ్యానంచేత మనోబలం, ఆత్మబలం పెంచుకోవాలి. కేవలం ధనబలమే చాలదు-ఉపయోగించదు. ఆత్యాచారం జరుగుతున్నపుడు శరీరబలం సహాయపడుతుంది. కానీ, ధనం వుంటే ఏమిచేయగలదు? కనుక మొదట ధ్యానం, తరువాత దానం. ఈ రెండూ చేయకలిగితే చాలు. ఇందుకోసం మనం అన్నిశక్తులనూ పెంచుకోవాలి. బుద్ధీ, బలమూ, ధైర్యమూ సంపాదించుకోవాలి.

ఇందులకు మనకు ఆదర్శ పురుషుడు ఆంజనేయస్వామి ఆయనను తలచుకొని, ఆయనను ఆదర్శంగా వుంచుకొని, ఆయనలాగు సర్వాంగ సుందరంగా జీవితాన్ని, సుందరకాండ చేసుకోవాలి. ఆయన జీవితమంతా ఇతరులకు సహాయం చేయటంలో గడిచిపోయింది. ఆయన్ను స్మరిస్తే మనకన్నీ సమకూరుతవి.

బుద్ధిర్భలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతా!

అజాడ్యం వాక్పటుత్వం చ హనూమ త్స్మరణాద్భవేత్‌ ||

బుద్ధిబలం, శరీరబలం, కీర్తి, సాహసం, ధైర్యం, ఆరోగ్యము, నిర్భయత్వం, చురుకుదనం, వచన చాతుర్యం - ఇలాంటి సద్గుణములకు నెలవు ఆ మహావీరుడు. ఆయననే ఆదర్శంగా పెట్టుకొని ఆయనను ధ్యానం చేస్తూ వచ్చామంటే ఆగుణాలు అలవడుతాయి. అపుడు మనం ఎంతమందికైనా సాయపడవచ్చు. మనలో ప్రతిఒక్కరూ ఈ విధంగా నడచుకొంటే సామూహికంగా హిందుత్వం వృద్ధి పొందుతుంది.

ఈ సందర్భంలో ఒక సందేహం రావచ్చు అందరు ధనికులుగా ఉండరు. అందులో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశమంటుతున్న ఈ రోజులలో ఎంతడబ్బు సంపాదించినా చాలటంలేదు కాబట్టి ఇతరులకు శక్తికొలది సహాయ పడదామనే సత్సంకల్పం కలిగి వున్నప్పటికీ అలా సహాయపడలేక పోతున్నారు. నిజమే. ఇందుకు మాకొక సమాధానం తోచింది. దానినే మేము మాట్లాడే ప్రతిచోటా ఆస్తికులయిన వారికి చెబుతున్నాం. మనకు ఉన్నదానిలోనే మనం ఇతరులకు మన కంటే దైన్యం అనుభవిస్తున్న వారలకు సహాయపడగలం. ఈ సహాయం ధనరూపంలోనే వుండ నక్కరలేదు. మనలో ప్రతి ఇంటిలోనూ ప్రతిగృహిణీ అన్నం వండేటందుకు ముందు ఒక పిడికెడు బియ్యం తీసి భగవదర్పణముగా పసుపుదారం కట్టిన ఒక చిన్న పాత్రలో వేయాలి. వీలయితే దానితోబాటు ఒక పైసాకూడ అందులోనే వేయవచ్చు. అది 'అన్నపూర్ణపాత్ర' 'ధాన్యలక్ష్మి పాత్ర'. ఇలా ఒక వారం రోజులలో పోగయిన బియ్యాన్ని అందుకు పాత్రుడు అని మనకు తోచిన బీదవానికి ఇచ్చివేయాలి. దగ్గరలో దేవాలయం ఏదైనావుంటే ఇలా సమకూడిన బియ్యం పైసలూ అక్కడ ఇచ్చి సద్వినియోగానికి ఏర్పాటు చేయాలి. ఆలయం లేనిచోట తమకు తామే నిజంగా కష్టపడుతున్న పేదవారికి ఇవ్వాలి.

ఈ పరోపకారం క్రొత్తకాదు. మనమతంలో అనాది నుంచీ వున్నది. అంతేకాదు..... ఈ పని తోటి మానవుల క్షేమం కోసమేకాక, ప్రతి ప్రాణికీ సహాయపడేటట్లు మన ధర్మ శాస్త్రాలు విధిస్తున్నవి. ఇప్పటికీ కొందరు పూర్వాచారాలు అనుష్ఠిస్తున్న బ్రాహ్మణ కుటుంబీకులు వైశ్వదేవం అని చేస్తారు. భోజనం చేసేముందు బలిహరణం అని వేస్తారు. దాని అంతర్యం చాలాగొప్పది. ఈ విశ్వాంతరాళంలో ఎన్నో లోకాలు క్రిందా పైనా వున్నాయి. దానిలో ఎన్నో కోట్ల జీవరాసులు. వీనికన్నిటికీ తృప్తి కలగాలన్న సద్భావంతో వైశ్వదేవ బలిహరణాదులు ఇవ్వబడుతున్నవి. ఈ విధమైన భూత తృప్తి భోజనాత్పూర్వమే కాక భోజనానంతరం కూడా ఉత్తరాపోశన పట్టునపుడు ఇతర ప్రాణులను ఉద్దేశించి చేయబడుతున్నది.

ఆ ప్రాణులు రౌరవాది నరకాలలో ఉన్న వాళ్ళైనాసరే, పుణ్యలోకాలలో ఉండే వారైనా సరే కోట్లు, అర్బుదాల సంఖ్యలో వుండేవారందరూ కూడ భోజనానంతరం మనం తృప్తిపడినట్లు, ఈ ఉదకంతో తృప్తిపడాలనే జీవకళ్యాణ భావం, జీవ కారుణ్యభావం ఆమంత్రంలో ఇమిడివుంది. వారందరూ అమృతపానం చేసినట్లు ఆనందించాలి.

అమృతాఫిధాన మసి.

రౌరవేపుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం

అర్థినాం ఉదకం దత్తం

అక్షయ్య ముపతిష్ఠతు||

ఇలాంటి మంత్రాలు భావాలు ఈనాడు లోపించినవి. కనుకనే. నేటి హిందువు ప్రపంచానికీ తనకూ పనికిరానివాడై పోతున్నాడు. అందుచేత హిందువు హిందువుగా రూపొందితే కానీ మనకు కృతకృత్యత లేదు. హిందూమతం అంటే ఒక్క భారతదేశానికే కాదు సంబంధించినది. అది విశ్వమతము.

నేటి పురాతత్వవేత్తలు క్రీ. పూ. 1400 సంవత్సరములలో నేడు యూరపు అని పిలువబడే భూభాగంలో మిత్ర సంస్కృతి (ఃషసశ ఈషషె) అని ఒకటి ఉండేదని అంటున్నారు. అదేదో క్రొత్త సంస్కృతి కాదు. అది మన ప్రాచీన హిందూ సంస్కృతియే. మిత్రావరుణులు ప్రాచీన కాలంలో దేవతలుగా పూజింపబడ్డారు. ''శం నో మిత్రః శం వరుణః'' అని ఉపనిషత్తులు ఎలుగెత్తి చాటుతున్నాయి. ఈనాడు కూడా 'సప్తద్వీపా వసుంధరా' అని ఆనాడు హిందూమతం వ్యాపించివున్న భూగోళమంగా పేర్కొనబడినది. ఈనాడు మనమేదో భూగోళం చదువుతున్నాం. ఇదేమీ క్రొత్తకాదు. భాగవతపురాణంలో ఎన్నో ఏళ్ళక్రితం ఉన్న విశ్వభూగోళం ఇవ్వబడియున్నది. ఐతే జ్యోతిశ్చక్రంలో కలిగిన మార్పులవల్ల ద్వీపాలలో భిన్నత్వం వచ్చింది. మార్పులు వచ్చాయి. కాలం ఎప్పుడూ ఒకే తీరున వుండదు. ఎగుడు దిగుడులు, ఒడుదుడుకులు, ప్రగతికి చిహ్నములు. దేశకాలస్థితులను బట్టి మానవ శరీరానికి వలెనే. ధర్మపురుష శరీరానికీ, రోగాలు వస్తూ వుంటాయి.

అటువంటి అపుడు శారీరక రోగాలకు వలెనే, మత సంబంధమయిన రోగాలకు ఉపప్లవాలకు కూడ చికిత్సలు, మందుమాకులు ఇవ్వటం జరుగుతూనే వుంటుంది. ఆర్యసమాజం, బ్రహ్మసమాజంలాంటి ఉద్యమాలు ఈలాంటి చికిత్సలే. ఐతే రోగం నయమైన పిదప ఔషధం అక్కరలేనట్లు మత సంబంధములైన ఒడుదుడుకులు అంతరించగానే ఈ ఉద్యమాలూ ఉపయోగించవు. వీని అవసరమూ తాత్కాలికమే.

( 9 - 7 )

వీనికి ముందు, శంకరులు, రామానుజలు, మొదలైన ఆచార్యపురుషుల ఆవిర్భావమూ, ఆయా యుగ పరిస్థితులను చక్కబెట్టుటకే జరిగింది. జ్ఞానతత్త్వం లోపించినపుడు శంకరులూ, భక్తిభావం లోపించినపుడు రామానుజులూ వచ్చి వానిని పునః ప్రతిష్టచేశారు. కనుక ధ్యాన, దాన, పరోపకారాలనే సామాన్య సూత్రాలమీద ఆధారపడిన హిందూ మత నవనిర్మాణం నేడు జరగాలి, అపుడు అది విశ్వధర్మమే అవుతుంది.

నిజమైన హిందువు భీరువుగా వుండటానికి వీలులేదు. ఇదం బ్రాహ్మ్యం - ఇదం క్షాత్రం' అన్నట్లు అధ్యాత్మబలాన్నీ శరీరబలాన్నీ హిందువులు వృద్ధిపరుచుకోవాలి. ప్రతి ఒక్కరూ మనమతానికి 'క్షతి' గాయం తగులకుండా దానిని రక్షించుటకు క్షత్రియులం కావాలి. 'క్షతాత్‌ కిల త్రాయతే ఇతి క్షత్రియః' అన్నది క్షత్రియ నిర్వచనం. సర్వ మానవులకు ప్రాణులకూ తోడ్పడేటందుకు సిద్ధంగా వుండాలి. దానికి వలసిన సాధన సంపత్తి, ధ్యానబలం, శరీరబలం పరోపకారభావం అలవరుచుకోవాలి. అపుడే మనం నిజమైన హిందువులం కాగలం. అపుడే ఇతర దేశములలో వున్న మన సోదరులకు సహాయం చేయగలం. విశ్వహిందూ పరిషత్తు యొక్క లక్ష్యమూ ఇదియే.


Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page